న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని, బీజేపీతో చేతులు కలుపాలని కమలం పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్టు నాతో చెప్పారు. అంతేగాక.. త్వరలో కేజ్రీవాల్ అరెస్టు అవుతారని, ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు చెప్పినట్టు తెలిపారు.
అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను. మద్యం పాలసీ కేసు ఓ తప్పుడు కేసు. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది’ అని పేర్కొన్నారు. అయితే విశ్వాస పరీక్షపై శనివారం చర్చ జరుగనుంది. ఇదే రోజు తన ముందు హాజరుకావాలని ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించింది. మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లకు స్పందించనందుకే ఈ ఆదేశాలు జారీ చేసింది.