Arvind Kejriwal | కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు శాశ్వతం కాదరి.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకేనన్నారు. ఓ జాతీయ మీడియా చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్తో పర్మినెంట్ పెళ్లేమీ జరగలేదన్నారు. ప్రస్తుతానికి బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం నియంతృత్వం, గూండాగిరిని అంతం చేయడమే మా పాలన లక్ష్యమన్నారు. ఢిల్లీలో ఏడు లోక్సభ స్థానాల్లోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని.. పంజాబ్లో మాత్రం రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే బరిలోకి దిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
పంజాబ్లోకి బీజేపీకి మనుగడ లేదన్నారు. మద్యం పాలసీ కేసుపై స్పందిస్తూ.. తాను సీఎం పదవికి రాజీనామా చేయబోయేది లేదన్నారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ మాత్రమే కోరుకుంటుందన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రముఖ రాజకీయ నేతలంతా జైలుకు వెళ్తారన్నారు. ఇంకా చెప్పాలంటే పుతిన్ సారథ్యంలో రష్యాలో పరిస్థితి ఎలా ఉందో.. అదే పరిస్థితి భారత్లోనూ వస్తుందని వ్యాఖ్యానించారు. ఆప్ పార్టీకి చెందిన నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలు బీజేపీలో చేరితే వెంటనే బెయిల్ వస్తుందని.. ఈ విషయంలో బీజేపీ నుంచి చి సందేశాలు వెళ్లినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు.
ఈ సందర్భంగా స్వాతిమలివాల్ ఘటనపై స్పందించేందుకు సీఎం నిరాకరించారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని.. షా ప్రధాని కావడం ఖాయమన్నారు. ఇదిలా ఉండగా.. మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలులో లొంగిపోవాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.