న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఒక ‘నిరక్షరాస్య ప్రభుత్వం’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైళ్లను సక్రమంగా నడపలేని వ్యక్తి, దేశాన్ని ఎలా ముందుకు నడుపగలరని ప్రశ్నించారు.
దేశ రైల్వే వ్యవస్థను కేంద్రం సర్వనాశనం చేసిందంటూ కేజ్రీవాల్ వరుస ట్వీట్లలో దుయ్యబట్టారు. రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లు జనరల్ బోగీల కంటే దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. ‘ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వారికి(బీజేపీ) తెలియదు. వారికి అస్సలు అర్థం కాదు. ఇది ఒక నిరక్షరాస్య ప్రభుత్వం. ఈ సర్కార్ ప్రతి రంగాన్ని నాశనం చేస్తున్నది’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.