న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శనివారం వ్యాఖ్యానించారు. ‘ప్రధాని దేశానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రధాని విద్యావంతుడై ఉండటం చాలా ముఖ్యం.
గుజరాత్ వర్సిటీ ప్రధాని విద్యార్హతల పత్రాలను ఇవ్వకుండా నిరాకరించటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మోదీ అహంకారమైనా కావాలి లేదా ఆయన డిగ్రీ నకిలీదైనా కావాలి’ అని అనుమానం వ్యక్తంచేశారు. మోదీ విద్యార్హతల పత్రాలను ఇవ్వాలని కేజ్రీవాల్ ఆర్టీఐ ద్వారా 2016లో దరఖాస్తు చేయగా, సమాచార కమిషన్ అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో సీఐసీ ఆదేశాలను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దరఖాస్తు చేసిన కేజ్రీవాల్కు రూ.25 వేల జరిమానా విధించింది.