న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ (Swiss Group IQAir) నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది. దీంతో ఐక్యూ ఎయిర్ జాబితాలో ఢిల్లీ మొదటి ప్లేస్లో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్లోని లాహోర్ రెండో స్థానంలో ఉండగా, కోల్కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్ టెన్లో నిలిచాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.
ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ, ఢిల్లీలో ఏ సమయంలో చూసినప్పటికీ 400-500గా ఉండడంతో.. ఈ గాలిని పీల్లచడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ-రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు.