న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ( Delhi Airport ) భారీగా వరదనీరు నిలిచింది. రన్వేతోపాటు విమానాలను నిలిపివుంచే స్థలం కూడా పూర్తిగా నీట మునిగింది. దాంతో ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికే నాలుగు దేశీయ, ఒక అంతర్జాతీయ విమానాన్ని ఢిల్లీకి బదులుగా జైపూర్, అహ్మదాబాద్ విమానాశ్రయాలకు మళ్లించారు.
ఇదిలావుంటే ఢిల్లీలో ఇవాళ కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చిరు జల్లులతోపాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నరు. మరోవైపు వర్షం తగ్గితే విమానాశ్రయంలో నీటిని తొలగించి విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.