అగర్తల, అక్టోబర్ 21: ఓటర్లను ఆకట్టుకునేలా ప్రజాకర్షక పథకాలు ప్రకటించేందుకే గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించలేదని బీజేపీపై సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి మండిపడ్డారు. అగర్తలలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన త్రిపుర ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్గా ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి 8న హిమాచల్ ప్రదేశ్, ఫిబ్రవరి 18న గుజరాత్ అసెంబ్లీ గడువు ముగుస్తున్నాయని, కానీ..కేంద్ర ఎన్నికల సంఘం హిమాల్చల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలను ప్రకటించి, గుజరాత్ను పక్కకు పెట్టేసిందన్నారు.
తన పొలిటికల్ ఫండ్ను ఓటర్లను కొనేందుకు బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదన్నారు. పార్లమెంట్, కోర్టులు, ఎలక్షన్ కమిషన్ తమకు మద్దతు ఇచ్చేలా కేంద్ర సర్కారు ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయపార్టీ కొత్త సంస్కృతిని తెరమీదకు తెచ్చిందని, బీజేపీని వ్యతిరేకించేవారిపై సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదన్నారు.