న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు చేసేందుకు కమిటీ ఆమోద ముద్రవేసింది. సాయుధ దళాలకు రూ.76,390కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో సైన్యం, నౌకాదళం, వాయుసేనకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు ప్రతిపాదనలు ఇందులో ఉన్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
భారత నౌకాదళం కోసం దాదాపు రూ.36వేలకోట్ల అంచనా వ్యయంతో నెక్ట్స్ జనరేషన్ కొర్వెట్ల (NGC)ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో సరికొత్త అంతర్గత డిజైన్ ఆధారంగా నౌకాదళం ఎన్ఎస్సీలను నిర్మించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ద్వారా డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్, ఎస్యూ-30 ఎంకేఐ, ఏరో ఇంజిన్ల తయారీ ప్రతిపాదనకు సైతం డీఏసీ ఆమోదించింది. భారత సైన్యం కోసం, రఫ్ టెర్రైన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్కులు (RTFLTs), బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్లు (BLTs), చక్రాల ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్ (Wh AFVలు) యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు (ATGMs), వెప్టన్ల సేకరణకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
మరోవైపు.. రక్షణ శాఖలో డిజిటలీకరణను ప్రవేశపెట్టేందుకు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలు కింద.. ‘డిజిటల్ కోస్ట్ గార్డ్’ ప్రాజెక్టుకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్ కింద వివిధ రకాల ఉపరితల, వాయుమార్గాల కార్యకలాపాలు, తీర ప్రాంత రక్షణ దళంలో లాజిస్టిక్స్, ఆర్థిక, హెచ్ఆర్ వంటి ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి సురక్షితమైన నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది.