చండీగఢ్: దేశ సైన్యాన్ని రాజకీయికరణ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బహిరంగంగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సైనికాధికారులు, రక్షణ నిపుణులు, విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నారు. 14.5 లక్షల మంది సైనికులు గల బలమైన భారత ఆర్మీని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ‘రానున్న శాసనసభ, లోక్సభ ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సిగ్గు లేకుండా సైన్యం సేవలను దుర్వినియోగపరుస్తున్నది’ అని ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. రాజకీయ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న కొందరు ఆర్మీ ఉన్నతాధికారుల అంగీకారంతో ఇలాంటి చర్యలు అమలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యకం చేశారు.