న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఈ విమానాల తయారీని ఎయిర్బస్-టాటా గ్రూపు వడోదరలో చేపట్టనున్నట్టు రక్షణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ ఈనెల 30న (ఆదివారం) శంకుస్థాపన చేస్తారని రక్షణశాఖ అధికార ప్రతినిధి అజయ్కుమార్ పేర్కొన్నారు. దీని ద్వారా భారత్లో సైనిక విమానాల ఉత్పత్తిని తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ చేపట్టనున్నది. త్వరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో భారీ రక్షణ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి కేటాయించడం గమనార్హం.
సీ-295 ఎయిర్క్రాఫ్ట్ 40-45 మంది సైనికులను లేదా 70 మంది ప్యాసెంజర్లను తీసుకెళ్లగలదని ఐఏఎఫ్ వైస్చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ తెలిపారు. 56 సీ-265 విమానాల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో జర్మనీకి చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో రూ.21,935 కోట్ల ఒప్పందం కుదుర్చుకొన్నది. పాత అవ్రో-748 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఒప్పందం ప్రకారం ఎయిర్బస్ నాలుగేండ్లలో 16 విమానాలను ‘ఫ్లై అవే’ పద్ధతిలో భారత్కు అందించనుండగా, మిగతా 40 ఎయిర్క్రాఫ్ట్లను ఒప్పందంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్) భారత్లో తయారీ, అసెంబ్లింగ్ చేపడుతుంది.