Haryana : బీజేపీ పదేండ్ల పాలనలో హరియాణ అన్ని రంగాల్లో వెనకబడిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా విమర్శించారు. సీఎంను, రాష్ట్ర బీజేపీ చీఫ్ను మార్చడం ద్వారా కాషాయ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదని అన్నారు. ఇలాంటి మార్పులతో ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేస్తారని చెప్పారు. కాషాయ పాలకులతో హరియాణ అభివృద్ధికి దూరమైందని ఆరోపించారు. పదేండ్ల బీజేపీ పాలనలో చోటుచేసుకున్న తప్పిదాలకు ఆపార్టీ భారీ మూల్యం చెల్లించకతప్పదని దీపీందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు.
హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక, హరియాణలో బీజేపీ, జేజేపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్ధాయిలో ఎండగడతామని హరియాణ అసెంబ్లీలో విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ను సాగనంపాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బీజేపీ, జేజేపీ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపు ఇస్తోందని చెప్పారు. హరియాణ మాంగే హిసాబ్ పేరుతో నిరసనలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాషాయ కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ఆయన వెల్లడించారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన అనంతరం తాము ఏం చేస్తామో ప్రజలకు విస్పష్ట హామీ ఇస్తామని అన్నారు. మరోవైపు జార్ఖండ్లో కాషాయ కూటమి వైఫల్యాలతో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత బీరేందర్ సింగ్ అన్నారు.
Read More :
Pawan Kalyan | ఒక్క రోజులో మార్పు తీసుకురాలేం.. కొంత సమయం కావాలి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్