హైదరాబాద్: అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున (December 26) 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో హిందూమహా సముద్ర (Indian Ocean) గర్భంలో ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్ల మధ్య ఘర్షణ ఏర్పడి 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది. దీంతో సముద్రంలో ఒక్కసారిగా నీరు ఉప్పొంగాయి. గంటల వ్యవధిలోనే తీరం వైపు దూసుకొచ్చిన శక్తిమంతమైన రాకాసి అలలు తీరప్రాంతాలను తమలో కలిపేసుకున్నాయి.
17.4 మీటర్ల మేర ఎగసిపడిన అలలు హిందూ మహాసముద్రంలోని 14 దేశాల తీరప్రాంతాలను కకావికలం చేశాయి. 5 వేల కిలోమీటర్లు ప్రయాణించిన సునామీ (Tsunami) అలలు ఆఫ్రికా తీరానికి కూడా తీవ్ర నష్టాన్ని కలగించాయి. భారత్, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్ సహా తొమ్మిది దేశాల్లో 2 లక్షల 30 వేలకుపైగా మందిని పొట్టన పెట్టుకున్నది. 18 లక్షల మంది నిరాశ్రయులు కాగా.. 50వేల మంది గల్లంతయ్యారు. భారత్లో సుమారు 10 వేల మందికి పైగా మరణించారు. అందులో అండమాన్ నికోబార్ దీవుల్లో 4 వేల మంది, తమిళనాడులో 4500 మంది మృతి చొప్పున ఉన్నారు. దీంతో ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణు బాంబు కంటే 23,000 రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) అప్పట్లో తేల్చింది. మొదట్లో భూకంప తీవ్రతను 8.8గా లెక్కించినప్పటికీ 2005లో 9.0కి సవరించారు. కానీ యూఎస్జీఎస్ మాత్రం 9.1గా అంచనా వేసింది. కానీ, 2006లో జరిపిన పరిశోధనల ప్రకారం భూకంప పరిమాణం 9.1 నుంచి 9.3 ఉంటుందని తేల్చారు.