అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల్ అంటూ బీజేపీ నేతలు ఆకాశానికెత్తే గుజరాత్లో నాటుసారా ఏరులై పారుతున్నది. కల్తీ మద్యం తాగి బోతడ్ జిల్లా కేంద్రంలో మంగళవారం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతా ల్లో నాటుసారా అందుబాటులో ఉన్నదని, కల్తీ మద్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని వార్త లు వస్తున్నాయి. రాజకీయ నేతలే ఈ దందాను నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తయారీదారులు కొందరు విషపూరితమిథైల్ ఆల్కహాల్ (మిథనాల్)ను నీటిలో కలిపి కల్తీసారా తయారు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల రక్తనమూనాలను పరీక్షించగా, మిథనాల్ తాగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు చెబుతున్నారు. 14 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
రూ.20కే ప్యాకెట్..
ఒక్కో ప్యాకెట్ రూ.20కే అమ్మినట్టు తెలిసింది. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బోతడ్ శివార్లలోని రోజిడ్ గ్రామంలోని కొందరు అస్వస్థతకు గురవ్వడంతో బోతడ్, బర్వాలాలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలకు వచ్చారు. చికిత్స పొందుతూ 28 మంది చనిపోయారు.
గొడౌన్ నుంచి దొంగిలించి..
జయేశ్ అలియాస్ రాజు అనే వ్యక్తి అహ్మదాబాద్లోని ఓ గొడౌన్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల అక్కడి నుంచి 600 లీటర్ల మిథనాల్ను దొంగిలించి బొతాడ్లోని బంధువు సంజయ్కు రూ.40 వేలకు 25న అమ్మాడు. అతను బొతాడ్ పరిసర గ్రామాలకు చెందిన అక్రమ మద్యం తయారీదారులకు విక్రయించాడు. నాటుసారా పేరుతో వారందరికీ అమ్మడంతో వారు అందులో నీళ్లు కలిపి రొజిడ్, రాన్పరీ, చందర్వా, దేవగణ, చోక్డీ గ్రామాలకు చెందిన వారికి అమ్మాడు. కల్తీసారా ఘటనపై దర్యాప్తునకు గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ రంగంలోకి దిగింది.
సారా డబ్బులు నేతల జేబుల్లోకే.. : కేజ్రీవాల్
మద్య నిషేధం ఉన్న గుజరాత్లో కల్తీ మద్యం భారీగా ఏరులైపారుతున్నది. అక్రమంగా అమ్ముతున్న వారికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారు. అందుకే వారిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ కల్తీ మద్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో దర్యాప్తు చేయాలి.