న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే అని, వాళ్లు స్వచ్ఛంధంగా భారత్కు తిరిగి వచ్చే రోజు దగ్గరలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) తెలిపారు. సీఐఐ బిసినెస్ సదస్సులో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం పట్ల భారత్ తన వ్యూహాన్ని రీడైజన్, రీ డిఫైన్ చేసిందన్నారు. ఇక పాకిస్థాన్తో కేవలం ఉగ్రవాదం లేదా పీవోకే అంశంపై మాత్రమే చర్చలు ఉంటాయన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలను ఉద్దేశిస్తూ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే ప్రజలను తమ కుటుంబంలో భాగస్వామ్యులుగా భావిస్తామని ఆయన తెలిపారు.
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh says, “Most of the people in PoK feel a deep connection with India, there are only a few who have been misled. The situation of our brothers living in PoK is similar to that of the brave warrior Maharana Pratap’s younger brother… pic.twitter.com/B8Pj13rtjT
— ANI (@ANI) May 29, 2025
పాక్ ఆక్రమిత్ కశ్మీర్లో ఉన్న ప్రజలు మనవాళ్లే అని నమ్ముతానని, మన కుటుంబీకులే అని భావిస్తానన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా వేరుపడ్డ పీవోకే ప్రజలే ఏదో ఒక రోజు తమ అంతరాత్మ చెప్పినట్లు ఇండియాకు తిరిగి వస్తారన్న నమ్మకం ఉందని రాజ్నాథ్ తెలిపారు. పీవోకేలో ఉన్న ప్రజలు భారత్తో గాఢమైన బంధాన్ని ఏర్పచ్చుకున్నట్లు చెప్పారు. కొందరు మాత్రం వాళ్లను తప్పుదోవ పట్టించారన్నారు. ప్రేమ, ఐక్యత, సత్యంపై నడిస్తే, పీవోకే మనతో కలిసే రోజు ఎంతో దూరం లేదన్నారు. నేను భారతీయుడిని, తిరిగి వచ్చేశానని పీవోకే ప్రజలు చెప్పుకుంటారన్నారు.
ఉగ్రవాదాన్ని పోషిస్తే తీవ్ర నష్టమే జరుగుతుందని, దీనికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. భారత స్వదేశీ రక్షణ సామర్థ్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. పదేళ్ల క్రితం భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు వెయ్యి కోట్లు దాటేది కాదు అని, కానీ ఇప్పుడు 23,500 కోట్లకు చేరిందన్నారు.