Supriya Sule |శరద్ పవార్ సారధ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితురాలైన ఆయన తనయ సుప్రియా సూలే.. బంధుప్రీతిపై గట్టిగా రియాక్టయ్యారు. ‘బంధుప్రీతి లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందా? మీరు సెలెక్టివ్గా బంధు ప్రీతి గురించి మాట్లాడవద్దు’ అని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలేలను శరద్ పవార్ ఇటీవల ప్రకటించారు. శరద్ పవార్ బంధుప్రీతికి ప్రాధాన్యం ఇచ్చారన్న మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలపై సుప్రియా సూలే ఘూటుగానే స్పందించారు.
‘బంధు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు పని తీరు గురించి, ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరు. నా పార్లమెంటరీ డేటా చూడండి. పార్లమెంట్ను మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా బంధువు గానీ నడుపడం లేదు. లోక్సభ కార్యకలాపాల్లో నేను ముందు వరుసలోనే ఉంటా.. బంధు ప్రీతి ఏమీ లేదు. కేవలం ప్రతిభ మాత్రమే ఉంది’ అని సుప్రియా సూలే అన్నారు.
ఇదిలా ఉంటే శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఏనాడూ తన మనస్సులో తన ఆకాంక్షలు, అభిలాషలను దాచి పెట్టుకోలేదు. సమయం వచ్చినప్పుడల్లా బయట పడుతూనే ఉన్నారు. కానీ ఎన్సీపీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడంపై తాను అసంతృప్తికి గురి కాలేదన్నారు. శరద్ పవార్ సైతం తన చేతులు పూర్తిగా నిండిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అజిత్ పవార్.. మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.