– నకిరేకల్ మండలంలో అవస్థలు పడుతున్న ఐదు గ్రామాల ప్రజలు
– ప్రజలకు శాపంగా మారిన అధికారుల నిర్లక్ష్యం
నకిరేకల్, జూలై 09 : నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామం నుండి అడవి బొల్లారం మీదుగా చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వరకు రహదారిపై ప్రయాణం అంటే ప్రజలు జంకుతున్నారు. గతంలో మట్టి రోడ్డు ఉన్నదాన్ని బీటి రోడ్డు వేస్తున్నారంటే ఓ రెండు, మూడు నెలల్లో పూర్తవుతుందని ఐదు గ్రామాల ప్రజలు ఆనంద పడ్డారు. రోడ్డుపై కంకర వేసి దాదాపు 3 నెలలు గడుస్తున్నా బీటి రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో కంకరపై ప్రయాణం ప్రజలకు, రైతులకు నరకప్రాయంగా మారింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2025 నవంబర్లో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
నాటినుండి రెండు నెలల తర్వాత చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు నుండి అడవి బొల్లారం, నెల్లిబండ వరకు సిఆర్ఆర్ నిధులు దాదాపు రూ.3.25 కోట్లతో పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి మార్చి నెలలో మట్టి పనులు చేశారు. ఏప్రిల్ నెలలో కంకర వేసి వదిలేశారు. అప్పటినుండి మూడు నెలలుగా చెరువు అన్నారం, నెల్లిబండ, అడవి బొల్లారం, చందంపల్లి, గొల్లగూడెం రైతులు, వాహనదారులు, పాదాచారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయకుండా ఉన్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ఒక కారణమైతే… అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారడం మరో కారణం. ఇప్పటికైనా కాంట్రాక్టర్, అధికారులు స్పందించి వెంటనే బీటి రోడ్డు పనులు ప్రారంభించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
నెల్లిబండ నుండి చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వరకు బీటి రోడ్డు వేస్తామని 2025 నవంబర్ లో శిలాఫలకం వేశారు. రోడ్డు తవ్వడానికి రెండు నెలలు, కంకర వేయడానికి రెండు నెలలు, కంకర వేసి మూడు నెలలు అవుతుంది. మరి బీటీ రోడ్డు వేయడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు. రోడ్డు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు తవ్వి రోడ్డుపై మట్టిని పోశారు. కంకరను రోలర్తో తొక్కించే పరిస్థితి ఇంతవరకు లేదు. నాణ్యతతో రోడ్డు నిర్మించడం లేదు. ఈ కంకర రోడ్డు వలన ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులలో బీటీ రోడ్డు వేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం.

కంకరపై ప్రయాణం… నరకప్రాయం