డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఉత్తరకాశి జిల్లాలోని మోరి ప్రాంతంలో ఆలయంలోకి ప్రవేశించినందుకు దళిత యువకుడిని స్ధానికులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. బాధితుడిని బైనోల్ గ్రామానికి చెందిన ఆయుష్ (22)గా గుర్తించారు. ఆలయంలో పూజలు చేసినందుకు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు తనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆరోపించారు.
జనవరి 9న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దళితుడైన ఆయుష్ సల్రా గ్రామంలోని ఆలయంలోకి ప్రవేశించడంతో ఆగ్రహించిన అగ్రవర్ణాల వారు అతడిని కట్టేసి రాత్రంతా తీవ్రంగా కొట్టారు. మంటలో కాల్చిన కర్రలతో తనపై దాడి చేశారని ఆయుష్ వెల్లడించాడు.
మరుసటి రోజు ఉదయం బాధితుడిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఉత్తరకాశీ ఎస్పీ అర్పన్ యధువంశీ వెల్లడించారు.