బెంగళూరు: ఎన్నికల హామీని నెరవేర్చని బీజేపీ మంత్రిని గ్రామస్తులు నిలదీశారు. అయితే ఆయన చెప్పిన సమాధానం విని వారంతా షాకయ్యారు. దీంతో ఎన్నికలప్పుడు తగిన సమాధానం చెబుతామని అన్నారు. అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని సుల్లియా నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే అంగార, ఆ రాష్ట్ర మత్స్య, ఓడరేవులు, లోతట్టు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోని గ్రామంలో రోడ్లు, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడంపై గ్రామస్తులు చాలా కాలంగా మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.
కాగా, నగరంలో ఒక రోడ్డును మంత్రి అంగార ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు వచ్చారు. తమ గ్రామంలోని రోడ్లు, సౌకర్యాలపై ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీని ప్రస్తావించి నిలదీశారు. అయితే ప్రకృతి వైపరిత్యాలు, కరోనా వల్ల పనులు చేపట్టలేదని మంత్రి అంగార తెలిపారు. ‘మీరు వినతిపత్రం ఇవ్వగానే పనులు కావు. ప్రభుత్వం నిధులు ఇస్తేనే పనులు మొదలవుతాయి’ అని అన్నారు.
మరోవైపు బీజేపీ మంత్రి అంగార సమాధానం విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎన్నికలప్పుడు సమాధానం చెబుతామంటూ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఆ గ్రామస్తులు నిర్ణయించారు.