తిరువనంతపురం, ఆగస్టు 29: సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గి దేశం ఊపిరితీసుకొంటున్న వేళ కేరళలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలో గడిచిన ఐదు తరోజుల్లో రోజుకు సగటున 30 వేల కేసులు నమోదు అయ్యాయి. బక్రీద్ సందర్భంగా ఆంక్షలు సడలించినప్పటి నుంచి 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల్లో కేరళ నుంచే 60శాతం దాకా ఉంటున్నాయి. కేసులు తగ్గినా కొవిడ్ నిబంధనలు పాటించడం ఎంత అవసరమో కేరళలోని పరిస్థితులు తెలుపుతున్నాయి. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో కేరళ రాష్ట్రం మళ్లీ ఆంక్షల బాట పట్టింది. రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కేరళలో ఆదివారం 29,836 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 75 మంది చనిపోయారు. కేసులు పెరగడంతో పాటు పాజిటివిటీ రేటు 20శాతానికి చేరడం వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తున్నది. కేరళ కేసులు మూడో వేవ్ ప్రారంభానికి సంకేతాలు కావొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ రాష్ట్రంలో కేసులు పెరగడానికి బక్రీద్, ఓనం పండుగలే కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. పండుగల వేల ఆంక్షలు సడలించడంపై వారు ముందే విమర్శించారు. శనివారం దేశవ్యాప్తంగా 45,083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.