లక్నో: ఒక యువ న్యాయవాది కోర్టు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాల్యంలో తండ్రి అకృత్యాలే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించాడు. తన మృతదేహాన్ని తండ్రి తాకకూడదని అందులో పేర్కొన్నాడు. (lawyer dies by suicide) ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల లాయర్ అయిన ప్రియాన్షు శ్రీవాస్తవ గురువారం కాన్పూర్లోని కోర్టు భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ సంఘటన వల్ల ఆ కోర్టు ప్రాంగణంలో భయాందోళనలు, గందరగోళానికి దారి తీసింది.
కాగా, ఆత్మహత్యకు ముందు శ్రీవాస్తవ వివరణాత్మక సూసైడ్ నోట్ను వాట్సాప్లో పోస్ట్ చేశాడు. మితిమీరిన తండ్రి కఠినత్వం, బాధాకరమైన బాల్యం అనుభవాలు, ఇష్టం లేని చదువు వంటివి తన ఆత్మహత్యకు కారణాలని పేర్కొన్నాడు. ఆరేళ్ల వయసులో అనుమతి లేకుండా మామిడి రసం తాగినందుకు తండ్రి తన బట్టలు విప్పి ఇంటి నుండి బలవంతంగా బయటకు గెంటేశాడని ఆరోపించాడు. ఇలాంటి సంఘటనలు తనలో నిరంతర అపరాధభావన, అవమానం, ఆత్మన్యూనతా భావాలు పెంచాయని పేర్కొన్నాడు.
మరోవైపు 2025లో ఎల్ఎల్బీ పూర్తి చేసినప్పటికీ న్యాయ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో ఇబ్బందులు, ఆర్థిక ఒత్తిడి, తండ్రి అనారోగ్యం వల్ల తలెత్తిన బాధ్యతలతో సహా, తన జీవిత పోరాటాన్ని సూసైడ్ నోట్లో శ్రీవాస్తవ ప్రస్తావించాడు. తనకంటూ సొంత, వృత్తిపరమైన గుర్తింపు లేకపోవడం, తండ్రి కింద పనిచేయడం పట్ల తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. ‘మా నాన్న నా శరీరాన్ని కనీసం తాకకూడదు’ అని పేర్కొన్నాడు. తన మరణానంతరం తన తల్లిని వేధించవద్దని, తన చర్యలకు మరెవరినీ నిందించవద్దని అందులో కోరాడు.
అయితే శ్రీవాస్తవ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. సూసైడ్ నోట్ అంశాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాది అయిన శ్రీవాస్తవ తండ్రి తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు వివరించారు. ఆయన నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
Also Read:
Tejashwi Yadav | నితీశ్ కుమార్ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
Watch: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన పెద్ద ఏనుగు.. తర్వాత ఏం జరిగిందంటే?