Cyclone Michaung | దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘మిచాంగ్’ నామకరణం చేశారు. ఈ తుఫాను ఏపీలోని నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను చెన్నైకి ఈశాన్యంగా వంద కిలోమీటర్లలో కేంద్రీకృతమై ఉందని. నెల్లూరుకు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. క్రమంగా బలపడి ఉత్తర దిశగా కదులుతూ మంగళవారం బాపట్ల సమీపంలోని నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కోస్తా ఆంధ్ర, యానాంతో పాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మరో వైపు భారీ వర్షాలతో చెన్నైలోని పలు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వానలకు ఒమాండూరర్ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వెలుపల, వాలాజా రోడ్, మౌండ్ రోడ్, అన్నా సలై, చెపాక్ సహా పలు ప్రాంతాల్లో నీటమునిగాయి. తుఫాను ప్రభావంతో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ప్రభుత్వం ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది. తుఫాను నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. చెన్నై పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మరో వైపు తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడారు. మిచాంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ను మోహరించామని.. అదనపు బృందాలను సిద్ధంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు.