అమరావతి: మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ప్రకటించారు.
ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తమిళనాడుకు కూడా ముప్పు పొంచి ఉంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఇచ్చారు. కంట్రోల్ రూం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు ఒడిశాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాగల మూడు రోజులు కీలకమని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. శనివారం ఉదయం నుంచి మత్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంత బాధితుల కోసం అవసరమైన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.