న్యూఢిల్లీ : జవాద్ తుఫాను తరముకొస్తున్నది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ముప్పు పొంచి ఉన్నది. శనివారం తెల్లవారు జామున ఈ తుఫాను ఏపీ, ఒడిశా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించింది. జవాద్ తుఫాను ముప్పు దృష్ట్యా.. దేశంలో తుఫాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
బెంగాల్కు ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
తుఫాను నేపథ్యంలో అధికారులు పశ్చిమ బెంగాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. అలాగే మరో ఎనిమిది బృందాలను రాత్రి వరకు తరలించనున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో ఒడిశాలోని గజపతి, గంజాం, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కేంద్రపారా, కటక్, ఖుర్దా, నయాఘర్, కందమాల్, రాయగడ, కోరాపుట్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం..
అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం కొద్ది గంటల్లో తుఫానుగా మారనున్నది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 3న ఆగ్నేయ, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న మధ్య భాగాన్ని చేరుకునే అవకాశం ఉంది. 4న ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.