న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఒడిశా వైపు గోపాల్పూర్కు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండగా.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తుందని పేర్కొంది. శనివారం ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో గాలులు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తుఫానుపై ప్రధాని సమీక్ష
జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించినట్లు పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. పలువురు కేంద్రమంత్రులు, పలు ఏజెన్సీల అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను సురక్షితంగా తరలించడమే కాకుండా విద్యుత్, కమ్యూనికేషన్, ఆరోగ్యం, తాగునీరు తదితర నిత్యావసరాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతరాయం కలిగితే సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే అవసరమైన మందులు తగినంత నిల్వ ఉండేలా చూడాలని ఆదేశించినట్లు పీఎంఓ పేర్కొన్నది.
కోణార్క్, ఇంటన్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్స్ రద్దు
వాతావరణ శాఖ నివేదిక, స్పెషల్ రిలీఫ్ కమిషన్ వివరాల ప్రకారం.. తుఫాను ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటనున్నది. ఈ క్రమంలో కోణార్క్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. రెండు ముఖ్యమైన కార్యక్రమాలను రద్దు చేయడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ రెండు కార్యక్రమాలు కోణార్క్లో జరుగాల్సి ఉన్నాయని ఒడిశా పర్యాటక శాఖ తెలిపింది.
రేపు ఉదయం తీరం దాటే అవకాశం
తుఫాను శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని ఐఎండీ అమరావతి డైరెక్టర్ స్టెల్లా శామ్యూల్ తెలిపారు. తుఫాను ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్తరం, ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంబడి కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో గరిష్ఠంగా గంటకు 80 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
100 కిలోమీటర్ల వేగంతో గాలులు
తుఫానుతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములతో వర్షాలు పడే అవకాశం ఉందని స్టెల్లా శామ్యూల్ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, ఈదురుగాలులతో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తుఫాను ప్రభావిత ప్రాంతాలల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నది. రాష్ట్రాలకు మొదటి విడుతగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి నిధులు విడుదల చేసింది. కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులతో పరిస్థితిపై సమీక్షించారు.
రంగంలోకి 29 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సెంట్రల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) రాష్ట్రాల్లో 29 బృందాలను మోహరించింది. మరో 33 బృందాలను అందుబాటులో ఉంచారు. నేషనల్ కోస్ట్ గార్డ్, నేవీ కూడా సహాయక చర్యల కోసం నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ఎయిర్ఫోర్స్, ఆర్మీకి చెందిన ఇంజినీర్ టాస్క్ఫోర్స్ను సైతం పడవలు, అవసరమైన రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉండాలని కోరింది.