న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. తుఫాను కారణంగా గంటకు 120 మీటర్ల వేగంతో పెనుగాలులు వస్తాయని, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో తుఫాను పశ్చిమ-వాయువ్య దిశగా పయనించిందని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. తుఫాను ఒడిశాలోని పూరీకి దక్షిణ – ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను ఆనుకొని.. వాయువ్య బంగాళాఖాతంలో చేరే అవకాశం ఉన్నది. తుఫాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని హౌరా, కోల్కతా, హుగ్లీ, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారుతోందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాను కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.