న్యూఢిల్లీ, జూలై 14: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది. ఈ ఏడాది తొలి 5 నెలల్లో (జనవరి నుంచి మే వరకు) ఆన్లైన్ మోసాల వల్ల భారతీయులకు దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, వాటిలో సగానికిపైగా నేరాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుంచి పనిచేస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్లే కారణమని పేర్కొన్నది.
సైబర్ కేటుగాళ్లు పాల్పడుతున్న మోసాల వల్ల మన దేశం ప్రతి నెలా దాదాపు రూ.1,000 కోట్లు నష్టపోతున్నదని ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది.
సైబర్ నేరాల కోసం భారతీయులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు ఆ అధికారి వెల్లడించారు. ఈ ఏజెంట్లు ఎక్కువగా లావోస్, మయన్మార్, కంబోడియాలో పనిచేసేందుకు నియమించుకుంటున్నారని చెప్పారు.