అది 2021 ఆగస్టు-2022 మార్చి మధ్య సమయం.. అంటే 8 నెలలు.. జమ్ముకశ్మీర్లోని లఢఖ్లో ఉన్న విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు. పవర్ గ్రిడ్ నెట్వర్క్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమాచారాన్ని సేకరించి, భవిష్యత్తులో భారత్ను ఇబ్బంది పెట్టేందుకు హ్యాకర్లు ఈ దాడికి దిగారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేశంలోని సమాచార వ్యవస్థలపై నిత్యం సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నాలుగేండ్లలో దేశంలో 6,70,000 సైబర్ దాడులు జరిగాయి.
కూర్చున్న చోటు నుంచే ఒక దేశ రహస్య, సున్నిత సమాచారాన్ని ప్రత్యర్థి దేశాలు చోరీ చేస్తున్నాయి.. క్షణాల్లో సమాచారాన్ని కొట్టేసి, సమయం వచ్చినప్పుడు దెబ్బ తీసేందుకు దాచుకొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలదీ ఇదే సమస్య. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు ఇది తలనొప్పిగా మారింది. మొన్నకి మొన్న రష్యా సైబర్ దాడులను తట్టుకోలేక అమెరికా, ఉక్రెయిన్ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ పాలసీని తయారు చేసుకొన్నాయి. అమెరికా ప్రభుత్వం ‘షీల్డ్స్ అప్’ అనే పాలసీని తీసుకొచ్చింది. సమాచార భద్రత కోసం ఆ దేశంలోని అన్ని కంపెనీలు దీని కిందికి వచ్చేలా చేసింది. డాటా చోరీకి గురవుతుందని అనుమానం కలిగితే వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రజలు, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేసింది. యూఎస్ హోంశాఖ పరిధిలోని సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) విభాగం షీల్డ్స్ అప్ను ఆపరేట్ చేస్తుంది. ఉచితంగానే సైబర్ సెక్యూరిటీ సర్వీస్, టూల్స్ అందిస్తుంది.
భారత్లో అత్యవసర స్థితి
నార్టన్ సెక్యూరిటీ సంస్థ చెప్పిన ప్రకారం.. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే రోజుకు 2 లక్షల సైబర్ దాడులను భారత్ ఎదుర్కొన్నది. ఈ మూడు నెలల్లో మొత్తంగా 1.8 కోట్ల సైబర్ అటాక్స్ జరిగాయి. అందులో 60 వేల పిషింగ్ ప్రయత్నాలు, 30 వేల టెక్ సపోర్ట్ స్కాంలు ఉన్నాయి. కేంద్రం లెక్కల ప్రకారమే చూసుకొన్నా.. గత నాలుగేండ్లలో 6.7 లక్షల సైబర్ దాడులు జరిగాయి. అంటే.. మన దేశంపై నిరంతరం సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నట్టు లెక్క. ప్రస్తుతానికి భారత్లో సైబర్ భద్రతకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళిక లేదు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలతోనే సరిపోతున్నది. కంప్యూటర్లను కాపాడుకొనేందుకు సందర్భానుసారం నిపుణులు చర్యలు మాత్రమే తీసుకొంటున్నారు. అయితే, దీర్ఘకాలంలో దిగి దేశ భద్రతకు ముప్పులా మారే అవకాశం ఉన్నదని, భారత్ కూడా అమెరికా మాదిరి సెక్యూరిటీ ప్రణాళికను సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక, సైబర్ డాటా చోరీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 గంటలకు రూ.734 కోట్లు నష్టపోతున్నట్టు ఓ సర్వే వెల్లడించింది.
సైబర్ సెక్యూరిటీలో తెలంగాణ ముందంజ
ఇంటర్నెట్ సేవలు అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. అయితే, మన దేశంలో చాలా రాష్ర్టాలు సైబర్ సెక్యూరిటీలో వెనుకబడి ఉన్నాయి. దీని వల్ల రక్షణ, ఆర్థిక సంస్థలు, ఇతర కీలక రంగాల డాటా చోరీకి గురవుతున్నది. అయితే, సైబర్ దాడులను అడ్డుకోవటంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. సైబర్ నేరాలను అదుపు చేయటంలోనూ కీలకంగా పనిచేస్తున్నది. దేశంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కూడా తెలంగాణలోనే ఉన్నది. దీని ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఐటీ సంస్థలు, విద్య, పరిశోధన, ఇతర రంగాలవారికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.