Cyber Fraud | సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ ఇంజినీర్కు టోకరా వేశారు. సోషల్ మీడియాలో వచ్చిన లింక్ను క్లిక్ చేసిన పాపానికి రూ.20లక్షలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. అవినాశ్ కృష్ణంకుట్టి కున్నుబారం (40) అనే వ్యక్తి ఇంజినీర్గా పని చేస్తున్నాడు. సమయం వృథా చేయడం ఎందుకని.. ఆన్లైన్లో ఏదైనా పని చేసుకుంటే ఇంత డబ్బు వస్తుందని భావించాడు.
ఈ క్రమంలో గతేడాది మార్చిలో అవినాశ్క గుర్తు తెలియని నంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అందులో వచ్చిన లింక్ను ఓపెన్ చేసి.. అందులో అడిగిన వివరాలను ఇచ్చాడు. ఆ తర్వాత అందులో జాయిన్ కావడంతో పాటు కొన్ని పనులు పూర్తి చేశాడు. ప్రతిఫలంగా కొంత డబ్బును సైతం అందుకున్నాడు. ఆ తర్వాత అతనికి కోలుకోలేని షాక్ తగిలింది. తాను సైబర్ నేరగాళ్ల బారినపడి ఉంటానని అవినాశ్ భావించలేదు. మొదట్లోనే నమ్మకంగానే ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు.
ఇక నమ్మకం కుదరడంతో అవినాశ్ ఏకంగా రూ.20.32లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత తాను మోసపోయానని అర్థమైంది. డబ్బులను వెనక్కి తీసుకునేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. చివరకు సైబర్ పోలీసులకు గోడును వెల్లబోసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్లపై క్లిక్ చేయవద్దని.. ఎక్కడా తప్పుడు పెట్టుబడులు పెట్టొద్దని పోలీసులు సూచిస్తున్నారు.