Cyber Crime | ఇటీవల కాలంలో ఆన్లైన్ స్కాములు విపరీతంగా పెరిగాయి. ఎంత అవగాహన కల్పిస్తున్నా ఎక్కడో ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. తాజాగా ఓ మహిళ గూగుల్లో సెర్చ్ చేస్తూ రూ.11లక్షలు మోసపోయింది. మహారాష్ట్ర పుణేకు చెందిన ఓ మహిళ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ కోసం గూగుల్ సెర్చ్లో చేసింది. నకిలీ వైబ్ సైట్ ఓపెన్ చేసిన మహిళ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంక్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసింది. అయితే, స్టేట్మెంట్ రాకపోవడంతో వెబ్సైట్లో కనిపించిన హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసింది.
కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. సదరు మహిళను తన మొబైల్లో సాఫ్ట్వేర్ (యాప్)ను ఇన్స్టాల్ చేయమని చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి చెప్పిన యాప్ మాత్రం రిమోట్ కంట్రోల్ యాప్. దీని సహాయంతో ఎవరైనా వ్యక్తులు ఫోన్ కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ అయ్యాక.. సదరు మహిళ బ్యాంకు ఖాతాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఫోన్లో మాట్లాడిన వ్యక్తికి చెప్పింది. సదరు వ్యక్తి మహిళకు వెబ్సైట్ లింక్ను పంపి.. ఇదే బ్యాంకు అధికారిక వెబ్సైట్ అని.. అందులో ఉన్న వివరాలను ఫిల్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వివరాలు వస్తాయని చెప్పాడు.
సదరు మహిళ ఆ వ్యక్తి చెప్పినట్లుగా ఆన్లైన్లో ఫామ్ను నింపింది. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నుంచి రూ.11లక్షలు డ్రా అయ్యాయని గ్రహించింది. లక్షల్లో సొత్తు మోసపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఏదైనా సమాచారం కోసం బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే సెర్చ్ చేయాలని.. ఫోన్లో ఎవరో చెబితే థర్డ్ పార్టీ యాప్లను ఇన్స్టాల్ చేయకూడదని.. తమకు సంబంధించి బ్యాంకు డేటా, వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని ఎవరికీ షేర్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.