Cyber crime : ఈజీ మనీకి అలవాటు పడిన ఆశిశ్ (Ashish) అనే ఓ విద్యార్థి తన స్నేహితుడైన ఇంజినీరింగ్ విద్యార్థికి అబద్ధం చెప్పి సాయం కోరాడు. అతడిని నమ్మి సాయం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి రూ.7 కోట్ల సైబర్ నేరం (Cyber crime) లో ఇరుక్కున్నాడు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఈ ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆశిష్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఎలా జరిగిందో బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ ప్రముఖ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థికి నవంబర్లో అతడి స్నేహితుడు ఆశిష్ ఫోన్ చేశాడు. తన బ్యాంకు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోవడం వల్ల తన ఖాతా బ్లాక్ అయ్యిందని, కొద్దిరోజులపాటు వినియోగించుకోవడానికి ఒక బ్యాంకు ఖాతా ఇవ్వాలని కోరాడు. ఏడాదిగా పరిచయం ఉండడంతో.. ఇంజినీరింగ్ విద్యార్థి తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డ్, నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఖాతాకు లింక్ చేసి ఉన్న ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వివరాలను స్నేహితుడికి పంపించాడు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 20న విద్యార్థిని సంప్రదించిన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ అధికారులు అతడి ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగినట్లు తెలుపడంతో విస్తుపోయాడు. షెల్ కంపెనీ పేరుతో కేవలం రెండు రోజుల్లోనే సైబర్ నేరగాళ్లు విద్యార్థి ఖాతా నుంచి రూ.7 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడించారు. దాంతో ఇంజినీరింగ్ విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి స్నేహితుడు ఆశిష్ను అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటకు వచ్చింది.
ఇంజినీరింగ్ విద్యార్థి దగ్గర తీసుకున్న ఖాతా వివరాలను ఆశిష్ విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయించినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు వెంటనే సదరు ఖాతాను బ్లాక్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.