Gold Smuggling | విదేశాల నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న కిలోకి పైగా బంగారాన్ని కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకాక్ విమానం నుంచి దిగిన ఓ మహిళ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు తనిఖీ చేసి 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి అబుదాబీ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు తన ప్యాంట్ జేబుల్లో బంగారం తరలిస్తున్నాడు. అతడ్ని అధికారులు తనిఖీ చేసి, విచారించడంతో 542 గ్రాముల బంగారం బయట పడింది. ఆ బంగారన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.29 లక్షల పై చిలుకు ఉంటుందన్నారు.