న్యూఢిల్లీ: చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, బీఎఫ్-7 ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. అయితే, ఢిల్లీలో బీఎఫ్-7 ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఒక్కటి కూడా లేదన్నారు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రస్తుతం తమ దగ్గర XBB వేరియంట్ కరోనా కేసులు నమోదవుతున్నాయని, తాము జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నామని కేజ్రివాల్ చెప్పారు. ఒకవేళ మహమ్మారి విస్తరించినా ఢిల్లీలో ఇప్పటికే 8 వేల కరోనా బెడ్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరో 36 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
అంతేగాక, తమకు 928 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను నిలువచేసే సామర్థ్యం ఉన్నదని కేజ్రివాల్ తెలిపారు. ఢిల్లీలో కేవలం 24 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని, మిగతావాళ్లు కూడా బూస్టర్ డోసు వేయించుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం 380 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని అంబులెన్సుల కోసం ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. కేంద్రం ఇచ్చే కొవిడ్ నూతన మార్గదర్శకాల కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు.