Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం ఆ లబ్ధిని ప్రజలకు చేర్చడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా సామాన్యుడి జేబును గుల్ల చేస్తూ దోపిడీ చేస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు తమకేమీ పట్టవన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
న్యూఢిల్లీ: అమెరికాలో బ్యాంకింగ్ రంగ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 72 డాలర్లకు పడిపోయింది. బుధవారం ఒక్కరోజే 5 శాతం, గత వారం వ్యవధిలో దాదాపు 10 శాతం క్రూడాయిల్ ధరలు పడిపోయాయి. గత ఏడాది జూన్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు 120 డాలర్లుగా ఉన్నది. అప్పటి నుంచి తగ్గుతూ వస్తున్నది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా.. అందుకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే యోచనలో కేంద్రం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
క్రూడాయిల్ ధరలు తగ్గిన మేరకు ఇంధర ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం లాభాలను తన జేబులో వేసుకొంటున్నది. వాస్తవానికి ఆ ప్రయోజనం ప్రజలకు చేరాల్సి ఉంది. తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తే దాదాపు రూ.10-15 వరకూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2019-20లో క్రూడాయిల్ ధర 60.47 డాలర్లు ఉండగా.. 2020-21లో 44.82 డాలర్లకు తగ్గింది. కరోనా సంక్షోభంతో డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే కేంద్రం ఆ మేరకు ధరలు తగ్గించకపోగా పన్నులు కూడా పెంచుకుంటూ పోయింది.
ఇంధన ధరల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. ఎన్నికలు ఉంటే.. అప్పటికి కొద్ది నెలల ముందు నుంచి ధరల్లో మార్పు చేయదు. అదే ఎన్నికల ఫలితాలు వచ్చీరాగానే ఇంధన వాత షురూ చేస్తుంది. పైగా, తాము పెంచింది తక్కువేనంటూ విచిత్రమైన సమర్థన చేసుకుంటుంది. కొన్ని రోజుల పాటు రోజుకు దాదాపు రూపాయి చెప్పున పెంచుకుంటూ పోయింది.