కోల్కతా: గ్రౌండ్ నుంచి వెళ్లనందుకు ఆడుకుంటున్న పిల్లల మీదకు నాటు బాంబులు విసిరారు. దీంతో ఐదుగురు బాలురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ నరేంద్రపూర్ పరిధిలోని దస్పరాలో ఈ సంఘటన జరిగింది. 12-13 ఏళ్ల వయసున్న పిల్లలు అక్కడి ఆట స్థలంలో ఫుట్బాల్ ఆడుతున్నారు. బాల్ ఒక మూలకు వెళ్లగా ఒక బాలుడు అక్కడకు వెళ్లాడు. అయితే అక్కడ నాటు బాంబులు ఉండటం చూసి మిగతా వారికి చెప్పాడు. దీంతో ఆ పిల్లలంతా అక్కడకు వచ్చి గుమిగూడి చూడసాగారు.
కాగా, ఆ నాటు బాంబులకు కాపలా ఉన్న కొందరు వ్యక్తులు ఆ పిల్లలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. వారు వెళ్లకపోవడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తులు రెండు నాటు బాంబులను వారి మీదకు విసిరారు. ఒకటి మిస్ కాగా, మరో నాటు బాంబు వారి సమీపంలో పేలింది. దీంతో ఐదుగురు పిల్లలు గాయపడ్డారు. అనంతరం ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు నాటు బాంబు పేలుడు శబ్దం విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన ఐదుగురు బాలురను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మెరుగైన వైద్యం కోసం ఆ పిల్లలను బఘజతిన్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలయ్యాయని, వారు సేఫ్గానే ఉన్నారని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన రెండు వర్గాల మధ్య పోరులో ఈ పిల్లలు గాయపడినట్లు తెలుస్తున్నది. ఒక వర్గం వద్ద ఉన్న నాటు బాంబులను ఈ పిల్లలపైకి విసిరినట్లు మరో వర్గం వారు ఆరోపించారు. అయితే టీఎంసీ నేత దీనిని ఖండించారు. తమ పార్టీపై చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.