రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరుగనున్నది. (Jharkhand Floor Test) అవినీతి ఆరోపణల కేసులో ఈడీ అరెస్ట్కు ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. దీంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్కు తరలించారు. సోమవారం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరుగనున్న నేపథ్యంలో వారంతా రాంచీకి తిరుగు ప్రయాణమ్యారు.
కాగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో మెజారిటీ సంఖ్య 41. అయితే జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది. ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్కు 16, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్)కు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం కూటమికి మొత్తంగా 46 మంది సభ్యులున్నారు.
మరోవైపు ప్రతిపక్ష బీజేపీకి 25 మందితోపాటు దాని మిత్ర పక్షాలతో కలిపి 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎదైనా ఊహించని పరిణామాలు జరిగితే తప్ప అధికార జేఎంఎం బలపరీక్షలో ఈజీగా గెలిచే అవకాశమున్నది.
2022 సెప్టెంబర్లో కూడా అవినీతి ఆరోపణల వల్ల హేమంత్ సోరెన్పై అనర్హత వేటు పడవచ్చని అంతా భావించారు. ఈ నేపథ్యంలో జేఎంఎం ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంది. 48 ఓట్ల మెజారిటీతో ఫ్లోర్ టెస్ట్లో విజయం సాధించింది.