పాట్నా: మామిడి పండ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తాపడింది. దీంతో అందులోని మామిడి పండ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Crowd loots mangoes) బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల అజయ్ పాశ్వాన్ తన భార్య సంతారా దేవితో కలిసి పశ్చిమ బెంగాల్ నుంచి ముజఫర్పూర్కు మామిడి పండ్లను వాహనంలో తరలిస్తున్నాడు. జాతీయ రహదారి 27లో ఆ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఆ వాహనం వద్దకు చేరుకున్న జనం రోడ్డుపై పడిన మామిడి పండ్లను ఏరుకుని ఎత్తుకెళ్లారు. ప్రమాదంలో గాయపడిన అజయ్, అతడి భార్యను ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాతే వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు. అతడి భార్య సంతారా దేవికి చికిత్స కొనసాగుతున్నది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే రోడ్డుపై పడిన మామిడి పండ్లను జనం ఎత్తుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.