బెంగుళూరు, మే 3: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో చెట్లకు పైసలు కాస్తున్నాయి! కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోని మామిడి చెట్టుకు కోటి రూపాయల నోట్లు కాశాయి. పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణియరాయ్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేపట్టగా, మైసూర్లోని అతడి ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుపై దాచి పెట్టిన నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ఈ విషయాన్ని ఐటీ శాఖ బుధవారం అధికారికంగా వెల్లడించింది. పెద్దమొత్తంలో నోట్ల కట్టలున్న బ్యాగ్ను రహస్యంగా మామిడి చెట్టుపై దాచగా, దానిని పట్టుకున్నామని మీడియాకు వెల్లడించింది. మే 10న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 13న బెంగుళూరు మార్కెట్ ప్రాంతంలో ఓ ఆటోలో కోటి రూపాయల నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు.