Crime news : వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ (Triangle Love Story) వారిని బద్ధ శత్రువులను చేసింది. ఈ శత్రుత్వమే ఒకరి హత్యకు దారితీసింది. ఈ క్రమంలో ఒక స్నేహితుడు మరొకరిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని రీవా జిల్లా (Riwa district), చోర్హటా (Chorhata) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని దుఆరి గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
దుఆరి పిప్రహా గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇస్రార్ (30), అతడి స్నేహితుడు ఆశిష్ కోల్ ఇద్దరూ ఒకే మహిళను ప్రేమించారు. ఈ విషయం వారి మధ్య గొడవకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఆశిష్ తన స్నేహితుడైన ఇస్రార్ను బయటకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వివాదం పెరగడంతో ఆశిష్ పదునైన ఆయుధంతో ఇస్రార్ మెడపై దాడిచేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని కాల్వలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఆగస్టు 26 నుంచి ఇస్రార్ కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల తర్వాత ఆగస్టు 28న ఓ కాలువలో అతడి మృతదేహం లభ్యమైంది. దాంతో కుటుంబసభ్యులు, స్థానికులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఇస్రార్ మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులు (సీడీఆర్) సహా ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. వీటి సహాయంతో నిందితుడు ఆశిష్ కోల్ అని గుర్తించారు.
టెక్నికల్ ఆధారాలతోనే కేసును ఛేదించినట్లు అదనపు ఎస్పీ భావనా మరావి తెలిపారు. నిందితుడు ఆశిష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.