Dancers Association | తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన సినీ డాన్సర్స్ అసోసియేషన్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. యూనియన్ ఆధిపత్యం, అధికారిక గుర్తింపు, బ్యాంకు లావాదేవీలు, నిధుల నిర్వహణ వంటి అంశాలపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్కు చేరింది. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నేతృత్వంలోని వర్గానికి, సంఘం నాయకురాలు సుమలత ప్యానెల్కు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది.
రఘు మాస్టర్ నేతృత్వంలోని కమిటీకి చట్టబద్ధమైన అధికారం లేదని సుమలత తన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అసోసియేషన్ బైలాస్ నిబంధనలను పక్కన పెట్టి యూనియన్ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వర్గం ఆరోపిస్తోంది. అంతేకాకుండా యూనియన్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను నియంత్రించే ప్రయత్నంలో ఫోర్జరీ సంతకాలు, తప్పుడు రికార్డులు సమర్పించారనే ఆరోపణలను కూడా సుమలత వర్గం చేసింది. అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా నిధులను డ్రా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ రఘు మాస్టర్ ప్యానెల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
అయితే సుమలత వర్గం చేసిన ఆరోపణలను రఘు మాస్టర్ తీవ్రంగా ఖండించారు. తమ కమిటీకే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుబంధ ఫెడరేషన్ ఆమోదం, అధికారిక గుర్తింపు ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఫెడరేషన్ నుంచి తమకు జారీ అయిన అధికారిక అనుమతి పత్రాల ఆధారంగానే బ్యాంకును సంప్రదించామని రఘు మాస్టర్ వర్గం చెబుతోంది. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ అని, యూనియన్ అభివృద్ధిని కొందరు వ్యక్తులు అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సభ్యుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని రఘు మాస్టర్ వర్గం మండిపడుతోంది. విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు స్వీకరించిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదానికి సంబంధించిన బ్యాంకు పత్రాలు, అధికారిక లేఖలు, డాన్సర్స్ యూనియన్ బైలాస్, ఫిల్మ్ ఫెడరేషన్కు సంబంధించిన నిర్ణయాలు, అనుమతి పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.