గౌహతి: విద్వేషం సృష్టించడం.. సమాజంలో చీలికలు తేవడం.. బీజేపీ ఏన్నో ఏండ్లుగా అనుసరిస్తున్న విధానమిది. ఇప్పటివరకు దేశంలో మతాల మధ్య విద్వేషం సృష్టించి సమాజంలో చీలికలు తెచ్చి పబ్బం గడుపుకొన్న బీజేపీ.. ఇప్పుడు రైతుల మధ్య కూడా చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఎరువులు వాడి పంటలు పండించడం సాధారణ విషయం. కానీ ‘ఫర్టిలైజర్ జిహాద్లో భాగంగా ముస్లిం రైతులు ఎక్కువ మొతాదులో ఫర్టిలైజర్లు వాడి వ్యాధులకు కారకులవుతున్నారు’ అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. తాము మాత్రమే ఫర్టిలైజర్లు వాడుతున్నామా అంటూ ముస్లిం రైతులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఎరువులు వాడుతున్నారంటూ వారు సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇటీవల గౌహతిలో సహజ పద్ధతిలో వ్యవసాయంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల మధ్య చిచ్చు పెట్టాలనే వ్యూహంలో భాగంగా ప్రభుత్వ భూమిని ముస్లిం వర్గం ఆక్రమించుకొంటున్నదని లాండ్ జిహాద్ పేరిట ప్రచారం చేశారు. ఫ్లడ్ జిహాద్లోభాగంగా సిల్చార్లో ఆనకట్టలు కూల్చి వరదలు వచ్చేలా చేశారని దుష్ప్రచారం చేశారు. తాజాగా ఫర్టిలైజర్ జిహాద్ పేరిట ప్రచారం చేస్తున్నారు.