డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జ్యోషీమఠ్లో ఉన్న ఇండ్లకు పగళ్లు వస్తున్నాయి. చాలా వరకు ఇండ్లు భూమిలోకి కుంచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠంలో బుధవారం రాత్రి ప్రజలు కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. జ్యోషీమఠ్ను విజిట్ చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం థామి తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆది గురువు శంకరాచార్య స్థాపించిన తొలి మఠం ఈ పట్టణంలోనే ఉంది. ఆయన పేరుతోనే ఈ ప్రాంతాన్ని జ్యోషీమఠ్గా పిలుస్తారు. అయితే తాజాగా ఆ పట్టణంలో సుమారు 561 ఇండ్లల్లో లోతుగా పగుళ్లు వచ్చాయి. క్రమంగా భూమి కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జ్యోషిమఠ్ నుంచి 66 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ తెలిపింది.
సింగ్ధార్, మార్వాడి ప్రాంతాల్లో పగుళ్లు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బద్రీనాథ్ హైవే వద్ద ఉన్న సింగ్ధార్తో పాటు జేపీ కంపెనీ గేటు వద్ద ఉన్న ఇండ్లలో పగుళ్లు అధికంగా ఉన్నాయి. గంట గంటకు ఆ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్నట్లు జోషీమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు.