హైదరాబాద్ : ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ఖాన్ను అరెస్టు చేశారని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు. హైదరాబాద్ ముగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. సినీ నటుడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేసి, చిత్ర హింసలకు పెడుతున్నారన్నారు.
ఆ కుటుంబం అంతా బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్ ముంద్రా పోర్టుకు డ్రగ్స్ వచ్చిందన్నారు. ముంద్రాపోర్టు ప్రధాన మంత్రి దత్తపుత్రుడు అదానీదని అన్నారు. అదానీ కుటుంబానికి రోజుకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని, సక్రమంగా సంపాదిస్తే రూ.వెయ్యి కోట్లు వస్తాయా అని ప్రశ్నించారు. హెరాయిన్ ద్వారానే రోజుకు వెయ్యి కోట్లు వస్తాయని చెప్పారు. ముంద్రా పోర్డుకు వచ్చిన డ్రగ్స్ తాలూకు కార్యాలయం అడ్రస్ విజయవాడలో ఉన్నదని, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమిత్ షా కనుసన్నల్లో నడస్తుందన్నారు. విజయవాడలో హెడ్ ఆఫీస్ పెట్టుకున్నారని, అక్కడి నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు హెరాయిన్ సరఫరా చేస్తున్నారని విమర్శించారు. హెరాయిన్ దొరికిన తర్వాత అదానీ ప్రపంచమంతా ముద్దయిగా మార్మోగుతున్న సమయంలో ఆర్యన్ఖాన్ను పట్టుకున్నారని ఆరోపించారు. హీరో కొడుకు గనుక దీన్ని అడ్డం పెట్టుకొని, అదానీ వ్యవహారాన్ని మరుగునపడేస్తున్నారని విమర్శించారు.
పెగాసెస్ సుప్రీం కోర్టు ప్రత్యేకంగా జస్టిస్ రవీంద్రన్ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయడం ప్రజాస్వామిక విజయమని నారాయణ పేర్కొన్నారు. పెగాసెస్ ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానం గూఢచార వ్యవస్థను నడిపిందన్నారు. ఈ సంస్థ భారతదేశానికి, ప్రపంచానికి, మానవ జాతికి వ్యతిరేకమైందన్నారు. భారతదేశంలో జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, అందరిపైనా నిఘా పెట్టారని, పార్లమెంట్ ఒక్క రోజు అంటే ఒక్కరోజు సజావుగా జరగలేదన్నారు.
పెగాసెస్ నిఘా సంస్థను ప్రశ్నించే వారిపై ప్రయోగించారన్నారు. వ్యక్తిగత భద్రత, ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత భద్రత ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును భంగం కలిగించారన్నారు. కాబట్టి దీనిపై చర్చ జరగాలని, కేంద్రం సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు మూడు సార్లు అడిగిందన్నారు. అయినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు జస్టిస్ రవీంద్రన్ నాయకత్వంలో ముగ్గురు టెక్నికల్ కమిటీ నియమించిందన్నారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడులు జరపడాన్ని ఆయన ఖండించారు.