పట్నా: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్ ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. తాజాగా, బీహార్ ప్రభుత్వం కూడా పశ్చిమబెంగాల్ నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ఆ రాష్ట్రం నుంచి రైళ్లు, బస్సుల్లో బీహార్ రాష్ట్రానికి వచ్చే వారందరికీ కొవిడ్ టెస్టులు చేయాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్లతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పొరుగు రాష్ట్రమైన పశ్చిమబెంగాల్లో కరోనా పాజిటివిటీ రేటు బీహార్ కంటే 10 శాతం అధికంగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సీఎం ఆదేశించారు. బీహార్ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షలు సంఖ్య పెంచాలని సూచించారు. కరోనా వైరస్ బాధిత కుటుంబాలకు వేగంగా రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని అందించాలన్నారు.