Covid shutdown: కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఢిల్లీలో తిరిగి కొవిడ్-19 నియంత్రణలు అమలవుతున్నాయి. తాజా నియంత్రణల్లో భాగంగా ఢిల్లీ అంతటా జిమ్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫిట్నెస్ ఇండస్ట్రీకి చెందిన లక్ష మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్ మళ్లీ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. జిమ్ల మూసివేత నిర్ణయం తీసుకునేముందు తమతో ప్రభుత్వం చర్చించలేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జిమ్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్-19 లాక్డౌన్ అనంతరం 25 శాతం పైగా జిమ్నాజియంలు రీఓపెన్ కాలేదని వారు చెబుతున్నారు. తాజాగా కొవిడ్-19 నియంత్రణలతో జిమ్లు మూతపడటంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఎనర్జీ ఫిట్నెస్ ఎండీ మహేందర్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం సామర్ధ్యంతో రెస్టారెంట్లను అనుమతించిన ప్రభుత్వం జిమ్లను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.
గత లాక్డౌన్లో తాము విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వచ్చిందని, పలువురు ఉద్యోగులు కొలువులు కోల్పోయారని, జిమ్ల నిర్వహణకు, పన్నుల చెల్లింపులకు జిమ్ యజమానులు ఆర్ధిక భారాన్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. 90 శాతం జిమ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, లాక్డౌన్ సమయంలో కనీసం అద్దెపై రిబేటు కూడా ఇవ్వలేదని ఐరన్ పంపర్స్ జిమ్ సీఈఓ దినేష్ శర్మ పేర్కొన్నారు. జిమ్లను కూడా ఇతర వ్యాపార సంస్ధల తరహాలో సరిబేసి పద్ధతిలో లేదా 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిమ్స్ మూసివేత ఉత్తర్వులు జారీ చేసే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఫిట్నెస్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించాల్సిందని అన్నారు. జిమ్లను మూసివేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిందని ఈ పరిస్ధితిలో తాము ఏం చేయాలని సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలని శర్మ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము ఎలా బతకాలని ఆయన నిలదీశారు.