బెంగళూర్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో కర్నాటక వెలుపలి నుంచి బెంగళూర్ నగరంలోకి వచ్చే వారు ఏప్రిల్ 1 నుంచి విధిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలని మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. గత నాలుగు నెలల గరిష్టస్ధాయిలో గురువారం బెంగళూర్లో 1400 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్కు గురైనవారిని గుర్తించేలా వారి చేతికి స్టాంప్ వేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
సామాజిక కార్యక్రమాల్లో 200 మందికి మించి రాష్ట్రప్రభుత్వం అనుమతించదని డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. జనసమ్మర్ధ ప్రదేశాలు, మాల్స్ వంటి నిర్ధిష్ట ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిత్యం శానిటైజ్ చేయాలని, అందుబాటులో ఉన్న పడకలు, ఐసీయూల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలే వెర్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కర్నాటక మంత్రి హెచ్చరించారు.