ముంబై: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మూడో దశను ప్రారంభిస్తున్నామని, ఈ దశలో 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అంతేగాక ఈ దశలో టీకా తయారీదారుల నుంచి నేరుగా టీకాలను సమకూర్చుకునే స్వచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర సర్కారు నిర్ణయం నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే అసోం ప్రభుత్వం తమ రాష్ట్రంలో 18 ఏండ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొవ్యాక్సిన్ తయారీదారు అయిన భారత్ బయోటెక్ సంస్థకు ఒక కోటి డోసుల కోసం ఆర్డర్ కూడా ఇచ్చింది.
ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 18 ఏండ్లకు పైబడిన అందరికీ మే 1 నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం చేసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా పాజిటవ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ‘కరోనా అంతమవుతుంది.. భారత్ గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మే 1 నుంచి 18 ఏండ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్లు ఉచింతంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపింది. అందుకు అవసరమైన నిధుల కోసం అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. కేవలం కొవిషీల్డ్, కొవాక్సిన్లతో సరిపెట్టుకోకుండా వీలైతే విదేశీ టీకాలైన స్పుత్నిక్ వీ, ఫైజర్ టీకాలను దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..