Telangana | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయితీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకొంటున్నరా? ప్రభుత్వంలో నంబర్-2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికే ఎసరు పెట్టారా? అది కుదరకపోతే కీలకమైన మున్సిపల్ శాఖను చేజిక్కించుకొనే ఎత్తుగడ వేశారా? ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారా? ఢిల్లీలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ నేత ద్వారా అగ్రనేతను కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చారా? దీంతో తనకు తప్ప ఎవరికీ హైకమాండ్తో సంబంధాలు ఉండకూడదని ముఖ్యనేత కట్టడి చేస్తున్నరా? దీన్ని మంత్రులు ధిక్కరిస్తున్నరా? అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ బయటపెట్టిన ఒక అక్రమ వ్యాపారాన్ని సదరు మంత్రిని టార్గెట్ చేసేందుకు ముఖ్యనేత వాడుకొన్నరా? ప్రస్తుతం గాంధీభవన్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే. వీటికి కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ కంపెనీకి ప్రభుత్వం ఇటీవల రూ.600 కోట్ల రోడ్డు పనులను అప్పగించింది. ముఖ్యనేతకు ఆ కాంట్రాక్టర్ అత్యంత సన్నిహితుడని చెప్తున్నారు. అయితే ఆ కాంట్రాక్టర్ కుటుంబానికి, అదే జిల్లాకు చెందిన నంబర్-2 మంత్రికి మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం కొనసాగుతున్నది. దీంతో తనకు రాజకీయంగా ప్రత్యర్థులైన వారిని ముఖ్యనేత పెంచి పోషిస్తున్నారని సదరు మంత్రి అనుమానించారని సమాచారం.
తనకు తెలియకుండా, తన ప్రత్యర్థి వర్గానికి అంతపెద్ద పని ఎలా ఇస్తారంటూ నేరుగా ముఖ్యనేతను ప్రశ్నించారట. ఇది తాను సొంతంగా చేయలేదని, హైకమాండ్లోని కీలక వ్యక్తి ఆదేశం మేరకే పని అప్పగించానని ముఖ్యనేత బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో ‘హైకమాండ్ పాత్ర నిజంగానే ఉన్నదా?’ అని మంత్రి తెలుసుకొనే పనిలో పడ్డట్టు సమాచారం.
ఢిల్లీలో అప్పటికే తాను నిర్మించుకొన్న నెట్వర్క్ సాయంతో సదరు మంత్రి హైకమాండ్ వర్గాలను కలిసినట్టు సమాచారం. కాంట్రాక్టు పనులు అప్పగించడంలో హైకమాండ్లోని కీలక వ్యక్తి పాత్ర లేదని నిర్ధారించుకున్నారట. ఈ విషయాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకువెళ్తూ.. తన రాజకీయ ప్రత్యర్థికి ఎలాంటి సహాయం చేయవద్దని స్పష్టంచేసినట్టు తెలిసింది. దీంతో కథ ముగిసినట్టేనని అనుకున్నారు. కానీ అసలు కథ అక్కడి నుంచే మొదలైంది. తనను కాదని నేరుగా హైకమాండ్తోనే సదరు మంత్రి సంబంధాలు పెట్టుకోవడం, వారితో మాట్లాడటం వంటివి ముఖ్యనేత జీర్ణించుకోలేకపోయారని సమాచారం. పీఠం విషయంలో తన నీడను కూడా నమ్మని ముఖ్యనేత.. సామాజికంగా, ఆర్థికంగా బలవంతుడైన ఓ మంత్రి ఢిల్లీతో నేరుగా సంబంధాలు నెరపడం, తాను చేస్తున్న పని, చెప్తున్న మాటల్లో వాస్తవాలను నిర్ధారించుకొనే స్థాయికి ఎదగడంపై ఆందోళన చెందినట్టు చెప్తున్నారు. అప్పటినుంచే సదరు మంత్రిపై ముఖ్యనేత కన్నేసి ఉంచినట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సదరు మంత్రికి ఢిల్లీతో ఉన్న సంబంధాల వివరాలు, గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అన్న అంశాలపై సమగ్ర అంతర్గత నివేదిక కావాలని ఇంటెలిజెన్స్ చీఫ్ను ఆదేశించినట్టు సమాచారం.
సదరు మంత్రికి ఢిల్లీతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? అనే కోణంలో ముఖ్యనేత వర్గం ఆరా తీసిందని సమాచారం. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆరేడు నెలల కిందట బీసీలకు 42 శాతం కోటా కోసం కొట్లాడుతున్న సమయంలో.. న్యాయవాదులతో మాట్లాడే ఆసరాతో కొందరు మంత్రులను తీసుకొని ముఖ్యనేత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ముఖ్యనేత బృందం బీసీ మంత్రులను న్యాయవాదుల వద్దకు పంపించిందని, వారు మాత్రం బీహార్ ఎన్నికలకు నిధుల సమీకరణ బాధ్యతలను, జాతీయ వ్యవహారాలు చూసే నేతలను కలిసినట్టు సమాచారం. ఈ బృందంలో సదరు మంత్రి కూడా కీలకంగా ఉన్నారని తెలిసింది. చర్చల సమయంలో బీహార్కు నిధులు సమీకరించి ఇచ్చే బాధ్యతను సదరు మంత్రి చూస్తాడంటూ అధిష్ఠానానికి పరిచయం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
‘ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే’ అన్నట్టుగా సదరు మంత్రి ఇదే అదనుగా పార్టీ పెద్దలతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. అసలే కరువులో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్కు ముఖ్యనేత కన్నా, సదరు మంత్రి వద్దే ‘విషయం’ ఎక్కువగా ఉన్నట్టు కనిపించిందట. హైకమాండ్లోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు త్వరలో ఎన్నికలు జరుగబోయే రాష్ర్టానికి సీఎం కావాలని ఆశ పడుతుండగా, నంబర్-2 మంత్రి అభయం ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు.
గత ఏడాది అక్టోబర్లో బెంగళూరు మీదుగా ఢిల్లీకి వెళ్లిన నంబర్-2 మంత్రి రెండు రోజులు అక్కడే ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో ఆర్థిక వ్యవహారాలు చూసే జాతీయ నేతను కలిసి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇప్పించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అదే సమయంలో ముఖ్యనేతను అధిష్టానం దూరం పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ జాతీయ నేత ‘ఎంఏయూడీ శాఖ ఎందుకు? ముఖ్య పదవే అడుగు’ అని సలహా ఇచ్చి, కాంగ్రెస్ అగ్రనేత వద్దకు తీసుకుపోయినట్టు సమాచారం. దాదాపు 45 నిమిషాలకు పైగా జరిగిన ఈ కీలక సమావేశంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని బీహార్ ఎన్నికల వరకు పార్టీకి తాను చేసిన సహాయ సహకారాన్ని సదరు మంత్రి వివరించారట. కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉన్నందుకే తనమీద బీజేపీ కక్ష గట్టిందని, ఈడీ దాడులు చేయించిందని అగ్రనేతకు విన్నవించారట. తనకు ముఖ్య పదవి ఇస్తే, బీజేపీని దీటుగా ఎదుర్కొనడంతోపాటు, పాత కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా కలుపుకొని పోతామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వంతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన ప్రతిపాదించినట్టు తెలిసింది. ఢిల్లీ అవసరాలు తనకు తెలుసునని, వాటిని తాను సర్దుబాటు చేయగలనని, ఆ మేరకు తనకు నెట్వర్క్ ఉన్నదని, ఇప్పటిదాకా చేసింది కూడా తానేనని అగ్రనేతకు ఆయన సవివరంగా చెప్పినట్టు తెలిసింది. అగ్రనేతతో అపాయింట్మెంట్ ఇప్పించిన కీలక నాయకుడు కూడా, ఇతని వల్లే పార్టీకి ఎక్కువ ఉపయోగమని వంతపాడారట. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్న ఆ అగ్రనేత నంబర్-2 మంత్రికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 30 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ముఖ్యపీఠం విషయంలో నిర్ణయం తీసుకొనే సమయం ఇంకా రాలేదని, సమయం వచ్చినప్పుడు తప్పక సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మున్సిపల్ శాఖను తప్పక ఇప్పిస్తానని మాట కూడా ఇచ్చారట.
ఢిల్లీ పరిణామాలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో ముఖ్యనేత హతాశులయ్యారట. నమ్మి ఢిల్లీకి పరిచయం చేస్తే, ఏమాత్రం అనుమానం రాకుండా, తనతో స్నేహంగా ఉంటూనే, ఢిల్లీలో లాబీయింగ్ చేసి, తన పీఠం కిందికే నీళ్లు తెచ్చారా? అంటూ సదరు మంత్రిపై ముఖ్యనేత ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే సామాజిక వర్గం, సంపదపరంగా, ఎమ్మెల్యేల మద్దతుపరంగా తన కంటే మెరుగ్గా ఉండటంతో సదరు మంత్రిని నేరుగా ఢీకొట్టడం అంత సులువు కాదని, అవకాశం కోసం ఎదరుచూసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఒక అక్రమ వ్యాపారాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు లేవనెత్తారు. ఆధారాలను సభ ముందు పెట్టారు. దీంతో అవినీతి నిజమేనని సభా సాక్షిగా ప్రభుత్వం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచడంతో ముఖ్యనేత రక్షిస్తారని అందరూ భావించారు. కానీ సదరు మంత్రిని రక్షించే ప్రయత్నం చేయకుండా, ఏకంగా విచారణకు ఆదేశించారు. ఇది ప్రతిపక్షాలను సైతం ఆశ్చర్యపరిచిందని సమాచారం. విచారణ ద్వారా వచ్చే విషయాలతో మంత్రి జుట్టును తన చేతిలో పెట్టుకోవాలని ముఖ్యనేత ఈ ఎత్తు వేసినట్టు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి.
ముఖ్యనేత ఎత్తుగడలకు సదరు మంత్రి ఏమాత్రం బెదరడం లేదట. దర్యాప్తునకు ఆదేశించిన మరుసటి రోజే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కేరళకు వెళ్లారు.