COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 1890 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9433కి చేరింది. ఇంతకు ముందు గతేడాది అక్టోబర్ 28న ఒకే రోజులో అత్యధికంగా 2,208 మందికి కొవిడ్ సోకింది.
మరో వైపు వైరస్ కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్లో ఒకరు మృతి చెందగా.. తాజాగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,30,831కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56శాతానికి చేరగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.29శాతానికి చేరింది. ఇప్పటి వరకు 4,47,00,147 మందికి వైరస్ సోకింది. రికవరీ రేటు 98.79శాతంగా ఉన్నది. ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో సన్నద్ధతను సమీక్షించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం నిర్వహించింది.
ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. మాక్డ్రిల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పాల్గొంటాయని, సోమవారం జరిగి వర్చువల్ మీటింగ్లో మాక్ డ్రిల్కు సంబంధించిన వివరాలు రాష్ట్రాలకు తెలియజేయనున్నట్లు చెప్పింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహ్ల్ సంయుక్తంగా విడుదల చేసిన అడ్వైజరీలో కొవిడ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. అలాగే ప్రజలు కొవిడ్ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు మాస్క్ ధరించి వెళ్లాలని, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వంటివి చేయొద్దని సూచించారు.