న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమోదయ్యాయి. మరో 904 మంది కొవిడ్ బారినపడి మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.
దీంతో ఆదివారం వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న భారత్ సోమవారం నాటికి బ్రెజిల్ను దాటి రెండో స్థానానికి చేరింది. 3.19 కోట్ల కరోనా కేసులు, 5.75 లక్షల మరణాలతో అమెరికా తొలిస్థానంలో కొనసాగుతున్నది. 1.34 కోట్ల కరోనా కేసులు, 3.53 లక్షల మరణాలతో బ్రెజిల్ మూడో స్థానంలో ఉన్నది.
కరోనా కేసులపరంగా తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్(50.5 లక్షలు), రష్యా (46.4 లక్షలు), బ్రిటన్ (43.6 లక్షలు), టర్కీ (38.4 లక్షలు), ఇటలీ (37.6 లక్షలు), స్పెయిన్ (33.4 లక్షలు), జర్మనీ (30 లక్షలు) ఉన్నాయి.