Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తుండడం ఫోర్త్ వేవ్కు సంకేతమా..? మళ్లీ లాక్డౌన్ తప్పదా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 97 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 40,215 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 2.14లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 7,830 కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో వైరస్ కారణంగా 16 మంది వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఇద్దరు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా మరియు గుజరాత్లో ఒక్కొక్కరు, కేరళలో మృతి చెందారు. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు కొవిడ్తో 5.31లక్షల మంది దుర్మరణం చెందగా.. మొత్తం కేసుల సంఖ్య 4.47కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు దేశంలో 220.66కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
చాలాదేశాల్లో ఇప్పటికీ మహమ్మారి కొనసాగుతూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉన్నది. దక్షిణ కొరియాలో 12వేలు, జపాన్లో 9వేలు, భారత్లో 5నుంచి7వేల కేసులు నమోదవుతున్నాయి. రష్యా, బ్రెజిల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గోరఖ్పూర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం డైరెక్టర్ రజనీకాంత్ను సంప్రదించగా.. ప్రస్తుతం దేశంలో కొత్త వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. దేశంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, అందుకే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం లేదని నిర్లక్ష్యం పనికిరాదని, తమను తాము కాపాడుకోవాలన్నారు. నివారణకు ప్రోటోకాల్స్ను పాటించాలని సూచించారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రశ్నే లేదన్నారు. కరోనా వైరస్ దేశంలో అంతానికి దగ్గరలో ఉందని, జలుబు, ఫ్లూ మాదిరిగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరో పది రోజులు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసులు పెరుగుతున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొంటున్నారు. ఈ కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని నిపుణులు వివరించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, అయితే, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీప్రాంతాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.